నిజామాబాద్, ఫిబ్రవరి 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను గుర్తించి, తక్షణమే వాటిని తొలగించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత రెసిడెన్షియల్ విద్యా సంస్థలు, వసతి గృహ సముదాయాల నిర్మాణాల కోసం ఆయా ప్రదేశాలలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించేందుకు గాను కలెక్టర్ మంగళవారం నిజామాబాద్ నగర శివారులోని నాగారం, గుండారం ప్రాంతాలను సందర్శించారు.
ఈ సందర్భంగా గుండారం గ్రామంలోని ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించిన సందర్భంగా పలు ఆక్రమణలు కలెక్టర్ గమనించారు. వెంటనే వాటిని తొలగించాలని, ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురి కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పై రెండు ప్రదేశాలలోనూ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి అనువైన పరిస్థితులు, అనుకూల వాతావరణం తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించారు.
ఎంత విస్తీర్ణంలో స్థలం అందుబాటులో ఉంది, రాకపోకలకు అనువుగా రోడ్డు మార్గం అందుబాటులో ఉందా అని పరిశీలన జరిపారు. పరిసర ప్రాంతాలలో నెలకొని ఉన్న పరిస్థితుల గురించి అధ్యయనం చేశారు. సమగ్ర వివరాలతో ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, తహసీల్దార్ బాలరాజు, సంబంధిత అధికారులు ఉన్నారు.