ఆయుష్‌ వైద్యశాలలను వెల్‌ నెస్‌ సెంటర్లుగా మారుస్తాము

కామారెడ్డి, ఫిబ్రవరి 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయుష్‌ వైద్యశాలలను విడతలవారీగా వెల్‌ నెస్‌ సెంటర్లుగా మారుస్తామని రాష్ట్ర ఆయుష్‌ కమిషనర్‌ డాక్టర్‌ అలుగు వర్షిణి అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో గురువారం ఆయుష్‌ వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

జిల్లా ఆస్పత్రికి 20 బెడ్స్‌తో వెల్‌ నెస్‌ కేంద్రం మంజూరైనట్లు తెలిపారు. ఆయుష్‌ వైద్యశాలలో ఉన్న వసతుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని వెల్నెస్‌ కేంద్రాల్లో యోగా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అన్ని కేంద్రాల్లో తాగునీటి వసతి, విద్యుత్‌ సౌకర్యం, మరుగుదొడ్ల వసతి ఉండేవిధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పుల్కల్‌ సబ్‌ సెంటర్‌లో ఉన్న ఆయుష్‌ వైద్యశాలను పుల్కల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోకి మార్చాలని సూచించారు.

బాన్సువాడలో ఉన్న యునాని వైద్యశాలను హనుమాజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోకి మార్చాలని కోరారు. గాంధారి సబ్‌ సెంటర్‌లో ఉన్న ఆయుష్‌ వైద్యశాలను సిహెచ్‌సిలోకి మార్చాలని వైద్యులను ఆదేశించారు. మద్నూర్‌లో ఉన్న ఆయుష్‌ వైద్యశాలను డోంగిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోకి మార్చాలని పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సమన్వయంతో ఆయుష్‌ వైద్యులు పనిచేయాలని చెప్పారు.

సమావేశంలో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఇంచార్జ్‌ జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్‌, జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ అధికారిణి సరస్వతి, ఆయుష్‌ వైద్యాధికారులు వెంకటేశ్వర్లు, వసంత్‌ పాటిల్‌, నీలిమ విజయ, శ్రీనివాస్‌, అనిల్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Check Also

డిగ్రీ పరీక్షలు ప్రారంభం

Print 🖨 PDF 📄 eBook 📱 డిచ్‌పల్లి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »