Breaking News

వర్ష సూచనల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌, జూలై 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ సూచనలు చేసిన నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు మరింత అప్రమత్తతతో కూడిన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. ప్రత్యేక అధికారుల నేతృత్వంలో రేపు (మంగళవారం) మండల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించాలని, చేపట్టాల్సిన తక్షణ చర్యల విషయమై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.

సోమవారం కలెక్టరేటులోని ప్రగతి భవన్లో ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. మండల స్థాయి సమావేశం నిర్వహించడానికి ముందు క్షేత్ర స్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని కలెక్టర్‌ సూచించారు. ప్రతి నివాస ప్రాంతంలో పారిశుద్ధ్య పనులు, రక్షిత మంచి నీటి సరఫరా జరిగేలా పర్యవేక్షణ జరపాలని, ఎక్కడైనా పైప్‌ లైన్‌ లీకేజీలు ఏర్పడితే వెంటనే సరి చేసుకోవాలని హితవు పలికారు. ఒక్కో ట్యాంకు వారీగా మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయించాలని, నివాస ప్రాంతాల నడుమ వర్షపు జలాలు నిలువ ఉండకుండా చూడాలన్నారు.

ఎక్కడైనా నీరు నిలువ ఉంటే దోమల వ్యాప్తిని నిరోధించేందుకు వీలుగా ఆయిల్‌ బాల్స్‌ వేయించాలని అన్నారు. ప్రజలు దోమతెరలు వాడేలా అవగాహన కల్పిస్తూ, విస్తృత ప్రచారం చేయాలన్నారు. శానిటేషన్‌, తాగునీటి సరఫరా విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యానికి తావు కల్పించినా, సీజనల్‌ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున అధికారులు, సిబ్బంది అందరూ అంకితభావంతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్‌ సూచించారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల విషయంలో ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని ఆదేశించారు.

సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లకు చెందిన విద్యార్థులు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు వీలుగా వారిని బయటకు వెళ్లేందుకు అనుమతించకూడదని హితవు పలికారు. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటన జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా షార్ట్‌ సర్క్యూట్‌తో విద్యుత్‌ ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నందున, అవసరమైన చోట తక్షణ మరమ్మతులు జరిపించాలని ఆదేశించారు. భారీ వర్షాల వల్ల జిల్లాలో 557 విద్యుత్‌ స్తంభాలు, 109 ట్రాన్స్‌ ఫార్మర్లు దెబ్బతిన్నాయని, వీటిని వెంటనే సరిచేస్తూ విద్యుత్‌ సరఫరా వ్యవస్థకు ఆటంకం లేకుండా యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టాలని సూచించారు.

నివాస ప్రాంతాలకు కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా పకడ్బందీగా వ్యవహరించాలని, ఎక్కడైనా సాంకేతిక సమస్య తలెత్తిన వెంటనే పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా వ్యవసాయ కనెక్షన్లకు సంబంధించి దెబ్బతిన్న విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లను రెండుమూడు రోజుల్లోపే అన్ని ప్రాంతాల్లో సరిచేస్తూ సేద్యపు రంగానికి కరెంటు సరఫరా యధాతథంగా జరిగేలా చొరవ చూపాలన్నారు. వర్షాల కారణంగా ఎన్ని నివాస గృహాలు పాక్షికంగా, ఎన్ని పూర్తిగా దెబ్బతిన్నాయన్నది క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తూ గ్రామాల వారీగా నివేదికలు సమర్పించాలని, బాధితులకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పరిహారం అందించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.

వరద నీటి ప్రవాహానికి దెబ్బతిన్న రహదారులను గుర్తిస్తూ, తాత్కాలిక మరమ్మతులు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించాలని ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ అధికారులకు సూచించారు. ఎక్కడ కూడా ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. దెబ్బతిన్న చెరువులు, చెక్‌ డ్యాంలు, కాల్వలు తదితర వాటి వివరాలను సేకరించి నివేదిక సమర్పించాలని ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, జిల్లా పరిషత్‌ సీఈఓ గోవింద్‌, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Check Also

ఘనంగా సీతారాముల కళ్యాణం

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »