Breaking News

వీర జవాన్‌కు అశ్రు నివాళి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా సాలూర మండలం కుమ్మన్‌పల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్‌ గంగాప్రసాద్‌ (32) మృతదేహం ఆదివారం ఉదయం స్వగ్రామానికి చేరుకుంది. సిక్కిం రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా తీస్తానది ఉధృతరూపం దాల్చి సంభవించిన వరదల్లో లాన్స్‌ నాయక్‌ హోదాలో పని చేస్తున్న ఆర్మీ జవాన్‌ గంగాప్రసాద్‌ గల్లంతై మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది.

గల్లంతైన జవాన్ల ఆచూకీ కోసం జరిపిన గాలింపు చర్యల్లో గంగాప్రసాద్‌ మృతదేహం గురువారం లభ్యమవగా, మృతదేహానికి పోస్టుమార్ధం నిర్వహించిన మీదట ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడి నుండి ఆదివారం ఉదయం స్వగ్రామమైన కుమ్మన్‌ పల్లికి ఆర్మీ జవాన్‌ పార్థీవదేహం చేరుకుంది. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

ఈ సందర్భంగా బోధన్‌ శివారు నుండి కుమ్మన్‌ పల్లి వరకు వేలాది మంది అంతిమ యాత్రలో పాల్గొని వీర జవాన్‌కు అశ్రు నివాళులర్పించారు. కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ, ఆర్మీ ఆఫీసర్లు, ఇతర ఉన్నతాధికారులు అంత్యక్రియల్లో పాల్గొని గంగాప్రసాద్‌ పార్థీవదేహంపై పుష్పగుచ్చాలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు.

అంతకుముందు బాధిత కుటుంబ సభ్యులను కలెక్టర్‌ ప్రభృతులు పరామర్శించి ఓదార్చారు. కాగా, గంగాప్రసాద్‌ అంతిమ యాత్ర బోధన్‌ నుండి కుమ్మన్‌ పల్లి వరకు ఇసుక వేస్తే రాలనంతగా అశేష జనవాహినితో నిండిపోయి రహదారి మొత్తం జనసంద్రంగా మారింది. గంగా ప్రసాద్‌ అమర్‌ హై నినాదాలు హోరెత్తాయి. త్రివర్ణ పతాకాలు చేతబూని వేలాది మంది స్వచ్చందంగా మోటార్‌ సైకిళ్లపై ర్యాలీగా అంతిమ యాత్రలో పాల్గొని వీర జవాన్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు.

దారి పొడుగునా రోడ్డుకు ఇరువైపులా చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా కులమతాలకు అతీతంగా బారులు తీరిన ప్రజలు వీర జవాన్‌ పార్థీవదేహంపై పూలు చల్లుతూ అశ్రు నయనాలతో వీడ్కోలు పలికారు. అమర్‌ రహే గంగాప్రసాద్‌, జోహార్‌ గంగాప్రసాద్‌ నినాదాల నడుమ అంతిమ యాత్ర సాగింది. జవాన్‌ గంగాప్రసాద్‌ మృతదేహానికి ఆర్మీ అధికారులు సైనిక లాంఛనాలతో నివాళులర్పించారు. గాలిలోకి కాల్పులు జరిపి శ్రద్ధాంజలి ఘటించారు. అంత్యక్రియల్లో అదనపు డీసీపీ జయరాం, జిల్లా సైనిక సంక్షేమ ఇంచార్జ్‌ అధికారి రమేష్‌, బోధన్‌ ఆర్డీఓ రాజాగౌడ్‌, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్‌కు రూ. 30 లక్షల విలువచేసే అంబులెన్సు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అథాంగ్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »