కామారెడ్డి, ఫిబ్రవరి 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు ప్రతీ విద్యా సంస్థలో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ను నియమించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపాల్ కు పోక్సో చట్టం పై ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చిన్న పిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరి కట్టేందుకు ప్రతీ పాఠశాలలో చైల్డ్ ప్రొటెక్షన్ అధికారిని నియమించాలని, పోక్సో చట్టం పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.
పిల్లలపై ఎటువంటి లైంగిక దాడులు జరుగకుండా ప్రారంభ దశలోనే అణిచివేసే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. ఆయా విద్యా సంస్థల్లో సి.సి టివి లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ, విద్యాబోధన ఒకటే కాదని, పిల్లల బాగోగులు చూడాల్సిన బాధ్యత కూడా ఉందని అన్నారు. పోక్సో చట్టం పై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. లైంగిక వేధింపులకు గురైన వారు తెలియజేయాలని సూచించారు.
జిల్లాలో ఇలాంటి సమావేశం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేవి తెలిసి ఉండాలని అన్నారు. పిల్లల పట్ల లైంగిక దాడులు జరుగకుండా ప్రొటెక్షన్ అధికారి పర్యవేక్షించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల, సి. డబ్ల్యూ.సి. మెంబర్ స్వర్ణ లత, యునిసెఫ్ రిసోర్స్ పర్సన్ డేవిడ్ రాజ్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి దయానంద్, రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపల్స్, తదితరులు పాల్గొన్నారు.