బాల్కొండ, ఫిబ్రవరి 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. మంగళవారం ఆయన బాల్కొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేలా అంకిత భావంతో పని చేయాలని హితవు పలికారు. రిసెప్షన్ సెంటర్, ఇన్ పేషంట్, ఫిమేల్, జనరల్ వార్డులు, ల్యాబ్, తదితర విభాగాలను పరిశీలించారు.
ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది గురించి ఆరా తీశారు. ప్రతి రోజు ఎంత మంది పేషంట్లు వస్తున్నారు, స్థానికంగానే కాన్పులు చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలు జరిగేలా కృషి చేయాలని వైద్యులకు సూచించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు. వైద్యులు, అందుబాటులో ఉండి రోగులకు సేవలందిస్తుండడం పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.
మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ లో మధ్యాహ్న భోజనం తనిఖీ
![](https://i0.wp.com/telanganalive.com/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-11-at-3.18.06-PM.jpeg?resize=618%2C387)
అంతకుముందు కలెక్టర్ బాల్కొండలోని బాలికల మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను కిచెన్, డైనింగ్ హాల్ లను పరిశీలించి సదుపాయాలను గమనించారు. బాలికల కోసం వండిన అన్నం, పప్పు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. బియ్యం నిల్వలు, సరుకుల స్టాక్ ను పరిశీలించారు. భోజనం ఎలా ఉంటుందని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు.
తాజా కూరగాయలు వినియోగించాలని, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు. పాఠశాలలో కొత్తగా టాయిలెట్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, స్థానిక అధికారులు ఉన్నారు.