నిజామాబాద్, ఫిబ్రవరి 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రేస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. గురువారం సిరికొండ మండలం న్యావనందిలో గల్ఫ్ వలస నిపుణుల బృందంతో ముచ్చటించారు. గల్ఫ్ దేశాల నుంచి వాపస్ వచ్చినవారి పునరావాసం, పునరేకీకరణ గురించి వలస కార్మిక నిపుణులు డా. సిస్టర్ లిజీ జోసెఫ్, మంద భీంరెడ్డి, చేగంటి మోహన్ల బృందం నిజామాబాద్ జిల్లాలో పర్యటించింది.
తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల సౌకర్యం తక్కువగా ఉన్న ప్రాంతాలలో వాతావరణ మార్పుల (క్లయిమేట్ చేంజ్) పరిస్థితులను తట్టుకునే విధంగా వలసదారులు, దుర్భలమైన (హాని పొందడానికి అవకాశం వున్న) కుటుంబాల స్థితిస్థాపకత (రెజిలియెన్స్) ను మెరుగుపరచడం కోసం ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు నిజామాబాద్ జిల్లాను ఎంపిక చేశాయి.
![](https://i0.wp.com/telanganalive.com/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-13-at-6.07.21-PM.jpeg?resize=594%2C370)
నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఈ ప్రాజెక్టు కోసం ఎంపిక చేసిన దర్పల్లి మండలం దుబ్బాక, హొన్నాజీపేట గ్రామాలను, సిరికొండ మండలం మైలారం, న్యావనంది గ్రామాలను సందర్శించిన బృందం ఆయా పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులను కలుసుకున్నారు. అనిశ్చిత వర్షపాతం, వరదలు, కరువులు తదితర వాతావరణ కారణాల వలన ప్రజలు తరచుగా వలస వెళ్లాల్సి వస్తున్న విషయంపై ఈ ప్రాజెక్టు దృష్టి సారిస్తుంది.
ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగాలైన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ (ఎఫ్ఏఓ), ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) లు మైగ్రేషన్ మల్టీ-పార్ట్నర్ ట్రస్ట్ ఫండ్ (ఎంఎంపిటిఎఫ్) మద్దతుతో రెండు సంవత్సరాల కార్యక్రమం (ప్రాజెక్టు) ను అమలు చేయాలని సంకల్పించారు.
ప్రాజెక్ట్ లక్ష్యాలు :
వాతావరణాన్ని తట్టుకునే వ్యవసాయంపై స్థానిక సామర్థ్యాలను నిర్మించడం, దానికోసం పెట్టుబడి పెట్టడం. వలస మద్దతు సేవలను బలోపేతం చేయడం. గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన వారిని సమీకరించడం, పునరేకీకరణ చేయడం. గల్ఫ్ కార్మికులు పంపిన డబ్బును సక్రమంగా వినియోగించే విధంగా (ఛానెలింగ్) చేయడం. స్థిరమైన జీవనోపాధికి గ్రామీణ యువతకు తోడ్పాటు అందించడం. లింగ సమానత్వం, మహిళా సాధికారత కోసం కృషి చేయడం. రక్షిత, సక్రమ, క్రమబద్ద వలసలు (సేఫ్, ఆర్డర్లీ అండ్ రెగ్యులర్ మైగ్రేషన్) ఉండే విధంగా కృషి చేయడం. ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను పొందడం.
ముఖ్య లబ్ధిదారులు :
మహిళలు రైతులుగా, వలస కుటుంబాల సభ్యులుగా లబ్ది పొందడం. యువజన సంఘాలు. చిన్న, సన్నకారు రైతులు. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు. స్వయం సహాయక బృందాలు. తిరిగి వచ్చిన వలసదారులు.