నిజామాబాద్, ఫిబ్రవరి 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆయా పాఠశాలల్లోని విద్యార్థులందరి ఆధార్ బయోమెట్రిక్ ను అప్ డేట్ చేయించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. తద్వారా భవిష్యత్తులో జేఈఈ వంటి పరీక్షలు రాసే సమయంలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తవని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో బుధవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది.
హైదరాబాద్ నుండి వీ.సీ ద్వారా డిప్యూటీ డైరెక్టర్ చైతన్య రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఐదేళ్లలోపు వయస్సు గల చిన్నారులు 61412 మంది, పదిహేను సంవత్సరాల వయస్సు గల వారు 40275 మంది ఆధార్ బయోమెట్రిక్ అప్ డేట్ పెండిరగ్ లో ఉందని డీ.డీ చైతన్యరెడ్డి తెలిపారు. ఈ విషయమై కలెక్టర్ స్పందిస్తూ, జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో విద్యార్థుల బయోమెట్రిక్ అప్ డేట్ కు చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ను ఆదేశించారు.

ఆయా పాఠశాలల వారీగా ముందస్తు సమాచారం అందిస్తూ బయోమెట్రిక్ అప్ డేట్ జరగని విద్యార్థులతో అప్డేట్ చేయించాలన్నారు. ముందుగా నిజామాబాద్ నగరంలోని పాఠశాలల్లో ఈ ప్రక్రియను వెంటనే చేపట్టాలని, నెల రోజుల వ్యవధిలో అన్ని పాఠశాలల్లో విద్యార్థులందరి బయోమెట్రిక్ అప్డేట్ జరిగేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలన్నారు. కాగా, అప్పుడే పుట్టిన శిశువు మొదలుకుని ఐదేళ్ల లోపు చిన్నారులందరికి తప్పనిసరిగా తల్లిదండ్రులు ఆధార్ నమోదు చేసేలా జిల్లా యంత్రాంగం తరపున చొరవ చూపాలని డిప్యూటీ డైరెక్టర్ చైతన్య రెడ్డి కలెక్టర్ ను కోరారు.
ఆధార్ సేవలలో సాంకేతిక సమస్యలు, ఇతర ఇబ్బందులను పరిష్కరించేందుకు జిల్లాలో మెగా క్యాంపు నిర్వహిస్తామని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఈ.డీఎం కార్తీక్, డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, లీడ్ బ్యాంకు మేనేజర్ అశోక్ చౌహన్, డీడబ్ల్యుఓ రసూల్ బీ, డీఎస్సీడీఓ నిర్మల, పోస్టల్ అధికారి సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.