కామారెడ్డి, ఫిబ్రవరి 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఇంటర్మీడియట్, పదవతరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా, ఎలాంటి మాల్ ప్రాక్టీస్కు తావివ్వకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మార్చి 5 నుండి 25 మార్చి వరకు ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం వార్షిక పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలో 38 కేంద్రాలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని, 8743 మంది మొదటి సంవత్సరం, 9726 మంది ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాయనున్నారని తెలిపారు.
ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు రాయవలసి వుంటుందని తెలిపారు. ఇందుకు 38 మంది చీఫ్ సూపరింటెండెంట్, 38 మంది డిపార్టుమెంటల్ అధికారులను నియమించడం జరిగిందని తెలిపారు. రెండు ఫ్లయింగ్ స్క్వాడ్, 6 సీటింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
పదవ తరగతి వార్షిక పరీక్షలు జిల్లాలో 64 కేంద్రాల్లో 12,579 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని, ఇందులో 6127 మంది బాలురు, 6452 మంది బాలికలు పాల్గొన నున్నారనీ తెలిపారు. 16 వొకేషనల్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఐదుగురు రూట్ అధికారులు, 22 మంది కస్టోడియన్స్, 22 జాయింట్ కస్టోడయన్స్, 11 మంది సి సెంటర్ కస్టోడయాన్స్, 3 ఫ్లయింగ్ స్క్వాడ్, 12 సీటింగ్ స్క్వాడ్, 698 మంది ఇన్విజిలేటర్ లను నియమించడం జరిగిందని తెలిపారు.
ఆయా పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు గ్రామీణ, ఇతర ప్రాంతాల నుండి పరీక్షల సమయానికి కేంద్రానికి చేరుకునేందుకు ఆయా సమయానికి బస్సులను ఆయా రూట్లలో నడపాలని తెలిపారు.
పరీక్షల నిర్వహణ సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో ఒక ఎఎన్ఎంలను అవసరమైన మందులతో నియమించాలని తెలిపారు. పరీక్ష కేంద్రాలలో శానిటేషన్ కార్యక్రమాలు ప్రతీరోజు నిర్వహించాలని మున్సిపల్, పంచాయతీ అధికారులను ఆదేశించారు. జవాబు పత్రాలను బిఎన్పిఎస్ సిస్టమ్ ప్రకారం పోస్టాఫీసులలో స్వీకరించాలని తెలిపారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి షేక్ సలాం, జిల్లా విద్య శాఖాధికారి రాజు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. చంద్ర శేఖర్, విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రావణ్ కుమార్, ఆర్టీసీ, పోస్టల్, ట్రెజరీ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.