‘సదరం’ దరఖాస్తుదారులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

సదరం సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు చేసుకుని, వైకల్య నిర్ధారణ కోసం హాజరయ్యే వారికి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. సదరం సేవలను సులభతరం చేస్తూ ఇటీవలే కొత్తగా యూనిక్‌ డిజెబిలిటీ ఐ.డీ (యూడీఐడీ) పోర్టల్‌ ప్రవేశపెట్టిన నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యల గురించి శనివారం సెర్ప్‌ సీ.ఈ.ఓ దివ్య దేవరాజన్‌ కలెక్టర్లు, డీఆర్డీఓలు, డిడబ్ల్యూఓలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పలు సూచనలు చేశారు.

అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసే సమయంలో అక్షర దోషాలు, ఇతర తప్పులకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ మేరకు మీ సేవ ఆపరేటర్లకు శిక్షణ అందించాలని సూచించారు. ఇప్పటివరకు ఐదు రకాల కేటగిరీల వారికే మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేదని, కొత్తగా రూపొందించిన యూడీఐడీ పోర్టల్‌ లో 21 రకాల కేటగిరీలను చేర్చారని కలెక్టర్‌ వివరించారు. తలసేమియా, ఆటిజం, యాసిడ్‌ బాధితులు, న్యూరో సంబంధిత బాధితులు కూడా సదరం కోసం యూడీఐడీ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

సదరం శిబిరాలలో వైకల్య నిర్ధారణ జరిగిన మీదట, సదరం సర్టిఫికెట్లను స్మార్ట్‌ కార్డు రూపేణా పోస్టల్‌ శాఖ ద్వారా ఇంటి చిరునామాకు పంపిస్తారని అన్నారు. చేయూత పెన్షన్లతో పాటు ఇతర అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాల లబ్ది కోసం సదరం స్మార్ట్‌ కార్డు చెల్లుబాటు అవుతుందని తెలిపారు. ఆన్లైన్‌ ద్వారా కూడా సదరం సర్టిఫికెట్‌ ను ఎప్పుడైనా డౌన్లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. కాగా, వైకల్య నిర్ధారణ కోసం శిబిరాలకు వచ్చే దరఖాస్తుదారులకు తాగునీరు, టాయిలెట్స్‌, కూర్చునేందుకు కుర్చీలు వంటి కనీస వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సమావేశంలో డీఆర్డీఓ సాయాగౌడ్‌, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 సోమవారం, మార్చి.3, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »