కామారెడ్డి, మార్చ్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు సజావుగా, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కు తావివ్వకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 5 నుండి 25 వరకు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జరుగుతున్న దృష్ట్యా పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు.
ఇప్పటికే జిల్లా సమన్వయ కమిటీ సమావేశం సంబంధిత అధికారులతో నిర్వహించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 38 కేంద్రాలలో 18,469 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, ఇందులో మొదటి సంవత్సరంలో 8743 మంది, ద్వితీయ సంవత్సరంలో 9726 మంది పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

పరీక్ష కేంద్రంలో త్రాగునీరు, విద్యుత్ సరఫరా, మెడికల్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, సూపరింటెండెంట్ రూంలో సీసీ టీవీ ఏర్పాటుచేయాలని తెలిపారు. ఏరోజు కారోజు ప్రశ్నపత్రాలు పోలీస్ స్టేషన్ నుండి బందోబస్తుతో తీసుకరావాలని తెలిపారు. ఇన్విజిలేషన్ డ్యూటీ లు ప్రక్క మండలం నుండి వేయాలని సూచించారు. పరీక్షలు ప్రశాంతంగా, ఎలాంటి సమస్య తలెత్తకుండా నిర్వహించాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, జిల్లా ఇంటర్మీడియట్ విద్య శాఖాధికారి షేక్ సలాం, పరీక్షల విభాగం అధికారులు, తదితరులు పాల్గొన్నారు.