గ్రామీణ నియోజకవర్గాలలో అడ్వాన్స్డ్‌ టెక్నాలజీ సెంటర్లు

నిజామాబాద్‌, మార్చ్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

యువతలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా గ్రామీణ నియోజకవర్గాలలో అడ్వాన్స్డ్‌ టెక్నాలజీ సెంటర్లను (ఏటీసీ) ఏర్పాటు చేయాలని సంకల్పించిందని ఆ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సంజయ్‌ కుమార్‌ వెల్లడిరచారు. గురువారం ఆయన జిల్లా కలెక్టర్లతో జూమ్‌ మీటింగ్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే రాష్ట్రంలో 70 ఏటీసీ కేంద్రాల నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని గుర్తు చేశారు.

అంతేకాకుండా స్థానిక పరిశ్రమలకు చేరువలో ఏటీసీలను ఏర్పాటు చేసినట్లయితే, సంబంధిత పారిశ్రామిక అంశాలతో కూడిన ట్రేడ్లలో యువతకు శిక్షణ అందించేలా ప్రణాళికలు చేపట్టవచ్చని అన్నారు. తద్వారా శిక్షణ పూర్తి చేసుకున్న వెంటనే యువతకు స్థానిక పరిశ్రమలలో ఉపాధి అవకాశాలు లభించేందుకు దోహదపడినట్లు అవుతుందన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుంటూ అనువైన ప్రదేశాలలో అందుబాటులో ఉన్న స్థలాల వివరాలతో కూడిన నివేదికలను వెంటనే పంపాలని ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సూచించారు.

కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, జిల్లాలోని ఆర్మూర్‌, నిజామాబాద్‌ రూరల్‌ అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏ.టీ.సీ కేంద్రాల ఏర్పాటుకు అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించి పూర్తి వివరాలతో కూడిన నివేదికను సోమవారం లోపు పంపిస్తామని తెలిపారు. జిల్లాలో వ్యవసాయ ఆధారిత, విత్తన శుద్ధి పరిశ్రమలకు అనుగుణంగా ఏటీసీ కేంద్రాలలో కోర్సులను ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. జూమ్‌ మీటింగ్‌లో సంబంధిత శాఖల అధికారులు, ఐ.టి.ఐ కళాశాల ప్రిన్సిపల్స్‌ పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, మార్చి.14, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »