నిజామాబాద్, మార్చ్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఓటరు జాబితా, ఎన్నికల నిర్వహణ తదితర వాటితో ముడిపడిన అంశాల గురించి చర్చించేందుకు వీలుగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ సూచించారు. జిల్లా కలెక్టర్లు, ఈ.ఆర్.ఓలతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారులుగా వ్యవహరించే కలెక్టర్లతో పాటు ఈ.ఆర్.ఓలు తమతమ స్థాయిలలో పొలిటికల్ పార్టీ మీటింగ్ లు ఏర్పాటు చేసి అప్ డేట్స్ అందించాలన్నారు.
సమావేశాల తేదీ, సమయాన్ని ఖరారు చేస్తూ ముందస్తుగానే రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేయాలన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలు, చేసిన తీర్మానాలను రిజిస్టర్లలో నమోదు చేయాలని, సమావేశాల వివరాలను సీఈఓ కార్యాలయానికి, గుర్తింపు పొందిన పార్టీల ప్రధాన కార్యాలయాలకు కూడా పంపించాలని సూచించారు. కాగా, ఓటరు జాబితా సవరణకు సంబంధించి కొత్తగా వచ్చిన దరఖాస్తులను వెంటదివెంట పరిశీలిస్తూ సకాలంలో పరిష్కరించాలని సీ.ఈ.ఓ సూచించారు.

వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.