నిజామాబాద్, మార్చ్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా టీ బీ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుండి చేపట్టిన ఈ ర్యాలీని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. నర్సింగ్ విద్యార్థినులు, వైద్యాధికారులు, సిబ్బందితో కలిసి ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. టీ. బీ అంతం మనందరి పంతం.. క్షయ వ్యాధి నిర్మూలనకు పాటుపడదాం అని నినాదాలు చేస్తూ ముందుకు సాగారు.
క్షయ వ్యాధి నిర్మూలనకు చేపడుతున్న చర్యల గురించి, వ్యాధి లక్షణాలు, పాటించాల్సిన జాగ్రత్తలు, చికిత్సా విధానం గురించి టీ బీ నియంత్రణ విభాగం అధికారులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ తుకారాం, జిల్లా టీ బీ నియంత్రణ విభాగం కో ఆర్డినేటర్ రవిగౌడ్, నర్సింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థినులు, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.