సెర్ఫ్‌ లక్ష్యాల సాధనకు కట్టుదిట్టమైన చర్యలు….

కామారెడ్డి, మార్చ్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

సెర్ఫ్‌ సంస్థ నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు కట్టుదటమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి లోకేష్‌ కుమార్‌ అన్నారు. గురువారం రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ కార్యదర్శి, సెర్ఫ్‌ కార్యక్రమాలపై సెర్ఫ్‌ సీఈఓ డి. దివ్య తో కలిసి జిల్లా కలెక్టర్‌ లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి మాట్లాడుతూ యాసంగి మార్కెటింగ్‌ సీజన్‌లో సెర్ఫ్‌ ద్వారా ఏర్పాటు చేయబోయే ఐకేపి కొనుగోలు కేంద్రాల సంఖ్య గణనీయంగా పెంచాలని రాష్ట్ర ముఖ్య మంత్రి నిర్ణయించారని తెలిపారు. ప్రస్తుతం 33 శాతం ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈ సీజన్‌ నుంచి 50 శాతానికి పెంచేలా ప్రతిపాదనలు తయారు చేయాలని అన్నారు.

జిల్లాలలో ఇతర శాఖల ద్వారా ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలు చేయలేని పక్షంలో ఆ కేంద్రాలను ఐకేపి లకు బదిలీ చేయాలని, అదనపు వరి ధాన్యం దిగుబడి నేపథ్యంలో నూతన కేంద్రాల ఏర్పాటు సైతం స్వశక్తి మహిళా సంఘాలచే ప్రారంభించాలని కలెక్టర్‌ లకు తెలిపారు. ఐకెపి కొనుగోలు కేంద్రాలకు అవసరమైన తేమ శాతం యంత్రాలు, ప్యాడి క్లీనర్లు, వేయింగ్‌ యంత్రాలు, ఇతర సామాగ్రి అందించాలని అన్నారు.

దివ్యాంగులకు యూ.డి.ఐ.డి. కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్‌ ప్రత్యేకంగా సమీక్షించి దివ్యాంగులకు నిర్ధారణ పరీక్షల నిర్వహణ కోసం స్లాట్‌ బుకింగ్‌ ప్రక్రియ ప్రారంభించాలని అన్నారు. నిర్ధారణ క్యాంపుల నిర్వహణ కోసం ఆసుపత్రిలో అవసరమైన సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్‌ లకు సూచించారు. దివ్యాంగులకు ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరమైన వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని, అవసరమైన నిధులు విడుదల చేయడం జరుగుతుందని అన్నారు.

కుటుంబంలో వృద్ధాప్య పింఛన్‌ పొందుతున్న వృద్దులు ఎవరైనా మరణిస్తే, వారి జీవిత భాగస్వామికి అర్హత ఉంటే వెంటనే పెన్షన్‌ మంజూరు చేయాలని కలెక్టర్‌ లకు సూచించారు. డిఆర్డిఓ, ఎంపిడిఓ, పంచాయతీ కార్యదర్శి, మున్సిపల్‌ కమీషనర్లతో సమావేశం నిర్వహించి ఇటువంటి కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు.

3 నెలలు ఫించన్‌ తీసుకోని లబ్దిదారులు వలస వెళ్లినట్లు సిస్టమ్‌ నమోదు చేస్తుందని అన్నారు. వలస వెళ్లినట్లు నమోదు అయిన వివరాలను అధికారులు పరిశీలన చేసుకొని పెన్షన్‌ తీసుకోక పోవడానికి గల కారణాలు తెలుసుకోవాలని, లబ్ధిదారులు మరణిస్తే వివరాలను అప్‌ డేట్‌ చేయాలని అన్నారు.

స్కూల్‌ యూనిఫామ్‌ కుట్టు పనులకు సంబంధించి కూలీ క్రింద 50 రూపాయలు మాత్రమే వచ్చినట్లు మహిళా సంఘాల సభ్యులు చెబుతున్నారని, దీనిని క్షేత్రస్థాయిలో కలెక్టర్లు పరిశీలన చేసి పెండిరగ్‌ చెల్లింపులకు సంబంధించిన బిల్లులు సమర్పించేలా చూడాలని, ప్రభుత్వానికి సమర్పించిన ప్రతి బిల్లు చెల్లింపు పూర్తవుతుందని అన్నారు.

స్వశక్తి మహిళ సంఘాల ద్వారా సృష్టించబడిన స్టిచ్చింగ్‌ సెంటర్‌ లు పూర్తి స్థాయిలో వినియోగించేలా ప్రణాళికలు తయారు చేయాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలకు యూనిఫామ్‌ కుట్టిన తర్వాత ప్రైవేట్‌ గా కూడా కుట్టు పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.

మహిళా సంఘాల ద్వారా పెట్రోల్‌ బంకులను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని, ముందుగా జిల్లా స్థాయిలో పెట్రోల్‌ బంకుల ఏర్పాటుకు అనువైన భూములు గుర్తించాలని అధికారులకు సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గాలు, మండల కేంద్రాల స్థాయిలలో కూడా పెట్రోల్‌ బంకుల ఏర్పాటుకు కార్యాచరణ ఉంటుందని ఆయన అధికారులకు తెలిపారు.

మహిళలచే చేపట్టే పెట్రోల్‌ బంక్‌ లలో ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌ స్టేషన్‌, పిల్లలు ఆడుకునేందుకు ఆట స్థలం, క్యాంటీన్‌, చిన్న హోటల్‌ ఏర్పాటు చేసేందుకు వీలుగా ఉండాలని అన్నారు. మహిళా శక్తి మాల్స్‌ ఏర్పాటు కూడా అవకాశాలు కల్పించాలని అన్నారు. జిల్లా సమాఖ్య భవన నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు.

ఇందిరా మహిళా శక్తి బజార్‌ కింద షాప్స్‌ ఏర్పాటుకు ప్రతి జిల్లాకు లక్ష్యాలు నిర్దేశించడం జరిగిందని అన్నారు. ఇందిరా మహిళా శక్తి బజార్‌లలో ప్రజలకు అవసరమైన సామాగ్రి అందుబాటులో ఉండాలని, బజార్‌ ఎల్లప్పుడూ ప్రజలతో కిటకిటలాడేలా ఏర్పాటు చేయాలని అన్నారు.

జిల్లాలలో వివిధ సమయాలలో నిర్వహించిన తనిఖీలలో అవకతవకలు గమనించి లైసెన్స్‌ రద్దు చేసిన పెట్రోల్‌ బంక్‌లను మహిళా సంఘాలకు కేటాయించాలని అన్నారు. మహిళా సంఘాల సభ్యులకు ప్రమాద బీమా, సాధారణ బీమా పథకం ప్రభుత్వం అమలు చేస్తుందని, మరణించిన మహిళా సంఘాల సభ్యుల సరైన డాక్యుమెంట్‌ లను పరిశీలించి సరైన లబ్ధిదారులకు ఈ సహాయం అందేలా చూడాలని అన్నారు. జిల్లా కలెక్టర్‌ ప్రత్యేకంగా సమీక్షించి జిల్లాలో ఎంతమంది మహిళా సంఘాల సభ్యులు మరణించారు, వారిలో ఎంత మందికి ప్రమాద బీమా, సాధారణ భీమా అమలు అవుతుంది పరిశీలించి సంబంధిత లబ్ధిదారులకు సహాయం అందజేయాలని అన్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ మాట్లాడుతూ, కామారెడ్డి గతంలో 27 కొనుగోలు కేంద్రాలు ఉండగా, ప్రస్తుతం మరో 156 కేంద్రాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు పెంచడం జరుగుతుందని తెలిపారు. ఆయా కొనుగోలు కేంద్రాలకు కావలసిన ఎక్విప్మెంట్‌ సమకూర్చాలని తెలిపారు. పెట్రోల్‌ బంక్‌ ఏర్పాటుకు అనువైన భూములను గుర్తించాలని రెవిన్యూ, గ్రామీణాభివృద్ధి అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. తొలుత ఒక పెట్రోల్‌ బంక్‌ ఏర్పాటుకు సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆర్‌ఎస్‌ఇటిఐ ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ భవనాన్ని గుర్తించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫారం కుట్టుటకు మాచింగ్‌ బ్యాచింగ్‌ చేయాలని తెలిపారు. సదరం క్యాంపుల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని, తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ (రెవిన్యూ) వి.విక్టర్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్‌, ఎల్డీఎం రవికాంత్‌, జిల్లా సహకార అధికారి రామ్‌ మోహన్‌, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ రాజేందర్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి మల్లికార్జున్‌ బాబు, మెప్మా పిడి శ్రీధర్‌ రెడ్డి, గ్రామీణాభివృద్ధి, శిశు సంక్షేమం, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

బాబు జగ్జీవన్‌ రావు గొప్ప మానవీయ విలువలకు ప్రతిరూపం

Print 🖨 PDF 📄 eBook 📱 డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »