కామారెడ్డి, మార్చ్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
వ్యక్తిత్వం, మంచి నైపుణ్యత, సహాయ గుణం, హార్డ్ వర్క్ చేసే గుణం కలిగిన వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో గత 10 నెలలుగా పనిచేసిన ఆయన మంచి పేరు సంపాదించుకున్నారని, విధులలో నిబద్ధత కలిగిన వ్యక్తి అని అన్నారు.
నాయకత్వ లక్షణాలు కలిగి, ప్రతి పనిలో తనదైన శైలిలో విధులు నిర్వరించేవారని అన్నారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యంగ, సామాజిక సేవల్లో పాల్గొనాలని ఆకాక్షించారు. వీడ్కోలు సమావేశం పాల్గొన్న పలు జిల్లాల అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, ఆయన బంధువులు, శ్రేయోభిలాషులు మాట్లాడుతూ, చంద్రుని కైనా మచ్చ ఉంటుంది కావచ్చు గాని, మచ్చ లేకుండా నిర్భయంగా విధులు నిర్వహించేవారని తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాలు పాటిస్తూ, సకాలంలో బాధ్యతతో పనులు చేసేవారని, క్రింద స్థాయి ఉద్యోగులకు మార్గదర్శకులుగా ఉంటారని తెలిపారు.
ఎల్లప్పుడూ మందహాసంతో ఎంతటి పని అయినా అవలీలగా నిర్వర్తించేవారని అభివర్ణించారు. చివరగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, తన విధినిర్వహణలో జరిగిన సంఘటనలు, ఉద్యోగ ప్రస్తానం గురించి వివరించారు. ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ, ప్రజా ప్రతినిధుల మన్ననలు పొందానని తెలిపారు. జుక్కల్ నియోజక వర్గంలో ఎన్నికల నిర్వహణ సమయంలోని వివరాలు, ఆ ప్రాంత ఉద్యోగుల పనితనం గురించి వివరించారు. అనంతరం అధికారులు, ఉద్యోగులు, బంధువులు ఆయనను శాలువ, మెమొంటోలు, పూల గుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తొలుత శ్రీనివాస్ రెడ్డి దంపతులకు గజమాలతో సత్కరించారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వి.విక్టర్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, వివిధ జిల్లాల అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు,జిల్లా అధికారుల సంక్షేమ సంఘం, తెలంగాణ రెవిన్యూ సర్వీస్ అసోసియేషన్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం, తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం, ఎంపీడీఓ ల సంఘం, తహసీల్దార్లు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు, బంధువులు పాల్గొన్నారు.