నిజామాబాద్, ఏప్రిల్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నూతనంగా అందుబాటులోకి తెచ్చిన డిజిటల్ లైబ్రరీ విభాగాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థిని, విద్యార్థులు, నిరుద్యోగ యువత కోసం ఇంటర్నెట్ సేవలతో కూడిన డిజిటల్ లైబ్రరీ కోసం కలెక్టర్ ప్రత్యేకంగా రూ. ఐదు లక్షల నిధులను సమకూర్చారు.
ఈ నిధులతో ఇంటర్నెట్ సదుపాయంతో కూడిన పది కంప్యూటర్లతో డిజిటల్ లైబ్రరీని నెలకొల్పారు. దీనిని ప్రారంభించిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న అనేక మంది నిజామాబాద్ జిల్లాకు చెందిన యువతీ యువకులతో పాటు ఇతర జిల్లాల నుండి కూడా నగరానికి వచ్చి జిల్లా కేంద్ర గ్రంథాలయం సేవలను వినియోగించుకుంటున్నారని అన్నారు.

దీనిని దృష్టిలో పెట్టుకుని వారికి డిజిటల్ లైబ్రరీ కూడా అందుబాటులో ఉంచాలనే ఉద్దేశ్యంతో దీనిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోటీ పరీక్షలు, వివిధ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షల మెటీరియల్ ను ఆన్లైన్ ద్వారా సేకరించుకునేందుకు డిజిటల్ లైబ్రరీ ద్వారా వీలు కలిగిందన్నారు. ఉద్యోగార్థులు దీనిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు అవసరమైన మరిన్ని బుక్స్, జర్నల్స్ ను సమకూర్చడంతో పాటు డిజిటల్ లైబ్రరీలో అదనపు కంప్యూటర్లను ఏర్పాటు చేయిస్తామని అన్నారు. జిల్లా గ్రంథాలయంలో స్థలం సరిపోవడం లేదని, ఈ సమస్యను అధిగమించేందుకు తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇప్పటికే పాత డీఈఓ కార్యాలయంలోని పలు గదులను రీడిరగ్ రూమ్ గా వినియోగించుకోవడం జరుగుతోందని గుర్తు చేశారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారి కోసం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, తదితరులు చొరవ చూపి గత నెలలో మధ్యాహ్న భోజన సదుపాయం సమకూర్చడం అభినందనీయమని అన్నారు. జిల్లా గ్రంథాలయం సేవలను వినియోగించుకుని ఇటీవలే సుమారు 160 మంది వరకు యువతీ యువకులు పోటీ పరీక్షలలో ప్రతిభను చాటి వివిధ శాఖలలో ప్రభుత్వ కొలువులు సాధించడం పట్ల కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం డిజిటల్ లైబ్రరీ కూడా అందుబాటులోకి వచ్చినందున పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ మంరింత మంది పోటీ పరీక్షలలో ప్రతిభ కనబరచాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా డిజిటల్ లైబ్రరీలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించిన కలెక్టర్, యువతీ, యువకులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేష్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుగ్గారెడ్డి, అధికారులు, సిబ్బంది రాజారెడ్డి, నరేష్ రెడ్డి, తారకం, రాజేశ్వర్, శ్రీకాంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.