నిజామాబాద్, ఏప్రిల్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
మోర్తాడ్ మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డార్మెటరీ, స్టోర్ రూమ్, కిచెన్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ పట్టికలో పొందుపర్చిన వాటికి అనుగుణంగానే ఆహార పదార్థాలు ఉన్నాయా లేవా అని తనిఖీ చేశారు.
మెనూ ప్రకారం ఉడకబెట్టిన కోడిగుడ్లు, నిర్ణీత రోజులలో మాంసాహారం అందిస్తున్నారా అని ఆరా తీశారు. భోజనం తయారు చేసేందుకు వినియోగించే ఆహార పదార్థాలు, సరుకులు, కూరగాయలు కలుషితం కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వహకులకు సూచించారు. నాసిరకమైన బియ్యం, ఇతర ఆహార పదార్థాలు, కూరగాయలు సరఫరా చేసిన సమయంలో అధికారులకు సమాచారం అందించాలన్నారు.
విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, ఎంపీడీఓ తిరుమల, తహశీల్దార్ కృష్ణ, పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్.స్వప్న తదితరులు ఉన్నారు.