నిజామాబాద్, ఏప్రిల్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆర్మూర్ మండలం మంథని, జక్రాన్పల్లి మండలం కేశ్ పల్లి గ్రామాలతో పాటు మోర్తాడ్ మండల కేంద్రంలో ఐకెపి మహిళా సంఘాలు, సహకార సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం పరిశీలించారు. రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం వివరాల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు.
ధాన్యం తరలించిన రైతులను పలకరించి, కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని ఆరా తీశారు. ధాన్యం తూకంలో ఏమైనా తేడాలు ఉంటున్నాయా అని ప్రశ్నించగా, ఒక్కో బస్తాకు 41.5 కిలోల చొప్పున తూకం జరుపుతున్నారని రైతులు తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు నిలువ చేసిన ధాన్యం రాశులను సందర్శించి వాటి నాణ్యతను పరిశీలించారు. గ్రెయిన్ క్యాలిపర్ ద్వారా నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా సన్న ధాన్యం ఉందా లేదా అని కలెక్టర్ స్వయంగా పరిశీలన జరిపారు. మంథని గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో తూకం వేస్తున్న ధాన్యం అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించి ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు.
బాగా ఆరబెట్టి, శుభ్రపర్చిన ధాన్యాన్ని తరలించి ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తి స్థాయి మద్దతు ధర పొందాలని, సన్న ధాన్యానికి అదనంగా క్వింటాలుకు 500 రూపాయలు చొప్పున బోనస్ చెల్లించడం జరుగుతోందని గుర్తు చేశారు. ఇసుక, మట్టి బెడ్డలు, సేంద్రీయ పదార్థాలు, పొట్టు, తాలు గింజలు వంటివి లేకుండా, తేమ 17 శాతానికి మించకుండా ఎఫ్.ఏ.క్యూ ప్రమాణాల మేరకు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చేలా రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తద్వారా పూర్తిస్థాయిలో రైతులకు మద్దతు ధర అందడమే కాకుండా, రైస్ మిల్లుల వద్ద కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని కలెక్టర్ హితవు పలికారు.
కాగా, కొనుగోలు కేంద్రాల వద్ద మాయిశ్చర్ యంత్రాలు, టార్పాలిన్లు, వెయింగ్ మెషిన్లను సరిపడా సంఖ్యలో అందుబాటులో ఉంచాలని అన్నారు. అకాల వర్షాలు కురిసేందుకు అవకాశాలు ఉన్నందున రైతుల నుండి వేగవంతంగా ధాన్యం సేకరిస్తూ, వెంటదివెంట నిర్దేశించిన రైస్ మిల్లులకు తరలించాలని కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. సన్నాలు ప్రభుత్వం బోనస్ చెల్లిస్తున్నందున గత సీజన్ తో పోలిస్తే ఈసారి యాసంగిలో 80 శాతానికి పైగా సన్న రకం ధాన్యం పండిరచారని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కొనుగోళ్లను వేగవంతం చేస్తూ, నిర్దిష్ట గడువుకు ముందే ధాన్యం సేకరణ ప్రక్రియను పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అన్నారు.
ధాన్యం విక్రయించిన రైతులకు వెంటదివెంట బిల్లుల చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని, రైస్ మిల్లుల నుండి ఎప్పటికప్పుడు ట్రక్ షీట్లు తెప్పించుకుని ట్యాబ్ ఎంట్రీలు చేయాలని ఆదేశించారు. రైతుల నుండి ధాన్యం కొన్న వెంటనే వారికి పూర్తి వివరాలతో కూడిన రసీదును తప్పనిసరిగా అందించాలని, ధాన్యం సేకరణకు సంబంధించిన వివరాలను కూడా సంబంధిత రిజిస్టర్లలో స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట ఇంచార్జ్ డీఆర్డీఓ సాయాగౌడ్, ఆర్డీఓ రాజాగౌడ్, డీసీఓ ఎన్.శ్రీనివాస్ రావు, డీఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీ.ఎం శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.