కామారెడ్డి, ఏప్రిల్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లాలో భూ భారతి పై విస్తృత ప్రచారం చేసి ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం సాయంత్రం భూ భారతి, ఇందిరమ్మ ఇండ్లు, త్రాగునీరు, రేషన్ కార్డుల వెరిఫికేషన్, భూగర్భ జలాల పెంపు అంశాలపై ఎంపీడీఓ, తహసీల్దార్లు, ఎంపీఓలు, మండల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూ భారతిపై ఈ నెల 17 నుండి 30 వరకు అవగాహన సదస్సులు జిల్లాలోని లింగంపేట్ మండలం మినహా మిగతా మండలాల్లో నిర్వహించాలని అన్నారు. ప్రతీ మండలంలోని రైతువేదిక, ఇతర ప్రాంతాలలో అవగాహన సదస్సులు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని, కనీసం సదస్సులకు 200 మంది తక్కున కాకుండా ప్రజలను, రైతులను తరలించాలని, ముఖ్యంగా ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని తెలిపారు.
ప్రతీ మండలానికి ఈ ఏర్పాట్లకు 10 వేల రూపాయలు నిధులు కేటాయించడం జరుగుతుందని, టెంట్లు, మైక్, త్రాగునీరు, ఫ్లెక్సీ, కరపత్రాలు, ఇతర ఏర్పాట్లకు వినియోగించాలని తెలిపారు.
పైలెట్ ప్రాజెక్టు కింద ప్రభుత్వ ఆదేశాల మేరకు లింగం పేట్ మండలంలో నిర్ణీత సమస్యలకు చర్యలు తీసుకోవడం జరుగు తుందని తెలిపారు. రోజుకు రెండు మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు ధరణీ వలన కలిగిన ఇబ్బందుల తో కోర్టుకు వెళ్ళడం జరిగిందని, ఈ భూ భారతి వలన నిర్ణీత గడువులోగా ఉన్నతాధి కారులకు అప్పీలు చేసుకోవచ్చని తెలిపారు. భూ భారతి చట్టం పై తహశీల్దార్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ప్రస్తుతం ధరణీ పోర్టల్ లో ఉన్న దరఖాస్తులను డిస్పోసల్ చేయాలని అన్నారు.
ఇందిరమ్మ ఇండ్లు కార్యక్రమం కింద రేపటి లోగా జాబితాలను ఇందిరమ్మ కమిటీలకు ఇవ్వడం జరుగుతుందని, 18 నుండి 21 లోగా లబ్ధిదారుల జాబితాలను తిరిగి ఇందిరమ్మ కమిటీలు ఇవ్వడం జరుగుతుందని, 22 నుండి 30 వరకు గెజిటెడ్ అధికారులు అనగా ఎంపీడీఓ, ఎంపీఓ, మండల వ్యవసాయ అధికారులు వెరిఫై చేయాలని తెలిపారు. మే 2 న ఆయా జాబితాలను గ్రామసభలో పెట్టడం జరుగుతుందని తెలిపారు. ఒక కుటుంబానికి ఒక ఇల్లు మాత్రమే మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.
జిల్లాలో ఈ వేసవి కాలంలో మంచినీటి సరఫరా కోసం ప్రభుత్వం ఒక కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, అట్టి నిధులు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. మోటార్ మరమ్మత్తు, పైప్ లైన్ మరమ్మత్తు, ఫ్లేషింగ్, నీటి సరఫరా, తదితర పనులకు వినియోగించుకోవాలని తెలిపారు. అలాగే మండలాల్లో ఉన్న ఎంపిడిపి నిధులను కూడా నీటి సరఫరాలకు వినియోగించు కోవాలని తెలిపారు.
జిల్లాలో భూ గర్భ జలాలు అంతరించిపోతున్న దృష్ట్యా ఉపాధి హామీ పనుల క్రింద సోక్ పిట్, ఫామ్ పాండ్స్, కాంటూరు కందకాలు వంటివి నిర్మించాలని, ప్రతీ మండలంలో ఇలాంటివి ఏర్పాటు చేయాలని తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్లు పర్యవేక్షణకు నియోజక వర్గాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని, బాన్సువాడ నియోజక వర్గానికి సబ్ కలెక్టర్ కిరణ్మయి, జుక్కల్ నియోజక వర్గానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ నాయక్, కామారెడ్డి నియోజక వర్గానికి ఆర్డీఓ వీణ, ఎల్లారెడ్డి నియోజక వర్గానికి ఆర్డీఓ ప్రభాకర్ లను నియమించడం జరిగిందని, ప్రతీ రోజు సాయంత్రం సమీక్షించడం జరుగుతుందని తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, స్థానిక సమస్యల అదనపు కలెక్టర్ చందర్ నాయక్, జిల్లా అధికారులు, ఎంపీడీఓ లు, తహసీల్దార్లు, ఎంపీఓలు పాల్గొన్నారు.