కామారెడ్డి, మే 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
భూ భారతి చట్టం ప్రకారం భూ సర్వే చేసి పూర్తి వివరాలను సేకరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం లింగంపేట్ మండలం కన్నాపూర్ గ్రామంలో భూ భారతి సర్వే టీమ్ లు క్షేత్ర పర్యటన చేసి సర్వే నెంబర్ 240 లో ఉన్న భూ వివరాలు, పాసు పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్న వాటి వివరాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూ భారతి చట్టం ప్రకారం సాగు చేస్తున్న భూముల వివరాలు, ఎన్ని సంవత్సరాల నుండి సాగు చేస్తున్నారు, సర్వే నెంబర్, భూ విస్తీర్ణం, సాగు చేస్తున్న రైతుల సంఖ్య, తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
అటవీ ప్రాంతమా లేక పట్టా భూమా అనే వివరాలు అటవీ శాఖ అధికారులు, రెవిన్యూ అధికారులు సంయుక్తంగా పరిశీలన చేయాలని సూచించారు. ఏళ్ల తరబడి సాగుచేస్తున్న భూ వివరాలను సంబంధిత రైతులను అడిగి తెలుసుకున్నారు. చట్టం ప్రకారం భూముల వివరాలు సేకరించి ఎలాంటి సమస్యలకు తావులేనట్లయితే పట్టా లకు సిఫారసు చేయాలని సూచించారు.
అనంతరం పరిమళ గ్రామంలోని రైతువేదికలో డెస్క్ వర్క్ చేస్తున్న రికార్డ్స్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్నే ప్రభాకర్, రెవిన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.