నిజామాబాద్, ఫిబ్రవరి 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రూపొందించిన పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితాను పరిశీలించి, ఏవైనా మార్పులు, చేర్పులు అవసరం ఉంటే సూచనలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ రాజకీయ పార్టీలను కోరారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీ.సీ హాల్ లో గురువారం ఆయన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కలెక్టర్ పర్యవేక్షణలో జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాను రూపొందించడం జరిగిందన్నారు. ఈ నెల 11 వ తేదీన జిల్లాలోని 31 మండలాలు, వాటి పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలలో ముసాయిదా జాబితాను ప్రకటించామని గుర్తు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను రూపొందించామని వివరించారు.
31 మండలాల పరిధిలో 307 ఎం.పీ.టీ.సీ స్థానాలు ఉన్నాయని, 851770 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఈ మేరకు మొత్తం 1564 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీటిలో 400 లోపు ఓటర్లు కలిగిన పోలింగ్ కేంద్రాలు 122 ఉండగా, 500 లోపు ఓటర్లతో కూడిన పోలింగ్ కేంద్రాలు 362 ఉన్నాయని, 750 వరకు ఓటర్లు కలిగిన పోలింగ్ కేంద్రాలు 1080 ఉన్నాయని వివరించారు.
కొత్తగా ఏర్పాటైన మండలాలను కలుపుకుని మొత్తం 31 మండలాలకు గాను ఒక్కో మండలం వారీగా ఎన్ని ఎంపీటీసీ స్థానాలు, ఎంత మంది ఓటర్లు ఉన్నారు, అందుకు అనుగుణంగా ఎన్ని పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందనే వివరాలను అదనపు కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలిపారు.
ముసాయిదా జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే తెలియజేయాలని కోరారు. పోలింగ్ కేంద్రాల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించేందుకు గాను అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లోనూ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎంపీడీఓలు గురువారం సమావేశాలు నిర్వహించారని అదనపు కలెక్టర్ తెలిపారు.
ఏవైనా అభ్యంతరాలు వచ్చిన పక్షంలో వాటిని పరిష్కరించి, పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రకటించడం జరుగుతుందన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సాయాగౌడ్, డిప్యూటీ సీ.ఈ.ఓ సాయన్న, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.