నిజామాబాద్, మార్చ్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల నిర్మల హృదయ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరీక్షల తొలిరోజు అయిన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు గురించి ఆరా తీశారు. సీ.సీ కెమెరా నిఘా నడుమ నిబంధనలకు అనుగుణంగానే పరీక్ష నిర్వహిస్తున్నారా? నిర్ణీత సమయంలో ప్రశ్న పత్రాలను తెరిచారా? లేదా? అని పరిశీలించారు.
పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి, ఏ.ఎన్,ఎం, టాయిలెట్స్ అందుబాటులో ఉన్నాయా అని గమనించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సజావుగా పరీక్షలు జరిపించాలని సూచించారు. పరీక్ష పూర్తయిన వెంటనే ఆన్సర్ షీట్లు తగిన పోలీసు బందోబస్తు మధ్య నిర్దేశిత కేంద్రాలకు తరలించాలని, ఎలాంటి కాపీయింగ్ కు అవకాశం లేకుండా పూర్తి పారదర్శకంగా, పక్కాగా పరీక్షలు జరిపించాలని ఆదేశించారు.
ఎలక్ట్రానిక్ వాచీలు వంటి ఉపకరణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని సూచించారు. కలెక్టర్ వెంట పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ సురయ్య, తదితరులు ఉన్నారు.