నిజామాబాద్, మార్చ్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఇంటర్మీడియట్ పరీక్షలు గురువారం రెండవ సంవత్సరం తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ భాష సబ్జెక్ట్లతో పరీక్షలు ప్రారంభమయ్యాయని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్ తెలిపారు. 420 విద్యార్థులు గైర్హాజరు కాగా ఒక విద్యార్థి చీటీలు రాయగా పట్టుకుని మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేశామని అన్నారు. మొత్తం జిల్లాలో 16,343 మంది విద్యార్థులకు గాను 15,923 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. మొత్తం 97.4 శాతం విద్యార్థులు పరీక్షలు రాయగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించామని తెలిపారు.
జిల్లా కలెక్టర్ ధర్మారంలోని సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాల తనిఖీ చేసి పరీక్షల నిర్వహణ పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. జిల్లాలో మొత్తం 57 పరీక్ష కేంద్రాలకు గాను 49 పరీక్ష కేంద్రాలను తనిఖీలు చేశారు. నిజామాబాద్ ఖిల్లా ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల – బీ సెంటర్లో ఓ విద్యార్థి చీటీలు రాస్తుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం పట్టుకుని మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసింది. జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులతో పాటు తాను ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లు, హై పవర్ కమిటీ, బల్క్ అధికారి, కస్టోడియన్లు తనిఖీ చేసి పర్యవేక్షణ చేసారని జిల్లా ఇంటర్ విద్యా అధికారి తెలిపారు.
జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపూడి రవికుమార్ నిజామాబాద్ పట్టణంలోని ఖిల్లా ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఏ సెంటర్, బి సెంటర్, నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, కంటేశ్వర్లోని ఎస్సార్ జూనియర్ కళాశాలలను, రవి కాకతీయ జూనియర్ కళాశాల ఏ సెంటర్, బీ సెంటర్, మహిళా కాకతీయ జూనియర్ కళాశాలలను తనిఖీ చేసి సమీక్షించారు.
పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నయ్య, రజీయుదిన్ అస్లాం, కనకమహాలక్ష్మి పది పరీక్ష కేంద్రాలను తనిఖీ చేయగా హై పవర్ కమిటీ శ్రీనాథ్ ఆధ్వర్యంలో నాలుగు పరీక్ష కేంద్రాలను, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నర్సయ్య, బాలాజీ, యమున బృందం 19 పరీక్ష కేంద్రాలను, సిటింగ్ స్కాడ్ బృందాలు ఆరు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. బల్క్ అధికారి బుద్ధిరాజ్ మూడు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించారు. కాగా నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించారు.