నిజామాబాద్, ఏప్రిల్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
భీంగల్ మండలం బడా భీంగల్, గోన్ గొప్పుల, సిరికొండ మండలం పెద్దవాల్గోట్ గ్రామాలలో సహకార సంఘాలు, ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ బుధవారం పరిశీలించారు. రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వల గురించి కేంద్రాల నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్థం కేంద్రంలో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు.
కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన రైతులను పలకరించి, కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని ఆరా తీశారు. గోన్ గొప్పులలోని కొనుగోలు కేంద్రంలో నిర్దేశిత పరిమాణం కంటే కొంత ఎక్కువ ధాన్యం తూకం వేస్తుండడం వల్ల తాము నష్టపోవాల్సి వస్తోందని పలువురు రైతులు అదనపు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో, నిర్ణీత పరిమాణంలోనే ధాన్యం తూకం వేయాలని అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు. రైతులను నష్టపరిచే చర్యలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా ఎక్కువ సంఖ్యలో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.
అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి స్థాయి లక్ష్యానికి అనుగుణంగా సాఫీగా సాగేలా కృషి చేయాలని అన్నారు. రైతులు ధాన్యం తెచ్చిన వెంటనే తూకం వేయించి, లారీలలో లోడ్ చేసి నిర్దేశిత రైస్ మిల్లులకు పంపించాలని, మిల్లుల వద్ద ధాన్యం అన్ లోడిరగ్ వెంటదివెంట జరిగేలా పర్యవేక్షణ జరపాలన్నారు. అదనపు కలెక్టర్ వెంట డీఆర్డీఓ సాయాగౌడ్, సివిల్ సప్లైస్ డీఎం శ్రీకాంత్ రెడ్డి, డీసీఓ శ్రీనివాస్ రావు తదితరులు ఉన్నారు.