ఆధార్‌ తరహాలో భూదార్‌ సంఖ్య కేటాయింపు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంపై రైతులు పరిపూర్ణమైన అవగాహన ఏర్పర్చుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. ఈ చట్టంలోని అంశాలపై గ్రామాలలో విస్తృతంగా చర్చిస్తూ, తోటి రైతులకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. శుక్రవారం డిచ్పల్లి మండలంలోని నడిపల్లిలో, మోపాల్‌ మండల కేంద్రంలో గల రైతు వేదికలలో వేర్వేరుగా నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన సదస్సులలో అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ తో కలిసి కలెక్టర్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భూ భారతి చట్టం ద్వారా రైతులకు.చేకూరే ప్రయోజనాల గురించి కలెక్టర్‌ ఒక్కో అంశం వారీగా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన భూ భారతి (ఆర్‌ ఓ ఆర్‌) చట్టం – 2025 జనవరిలో గెజిట్‌ రూపంలో వచ్చిందని, సమగ్ర అంశాలను పొందుపరుస్తూ ప్రభుత్వం ఏప్రిల్‌ 14న ఈ చట్టాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్‌ వివరించారు. భూ సమస్యలు కలిగిన రైతులు ఏడాది కాలం లోపు భూభారతి పోర్టల్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అవగాహన సదస్సుల అనంతరం మే మొదటి వారంలో అధికారులు గ్రామాల వారీగా సదస్సులను ఏర్పాటు చేసి అర్జీలు స్వీకరిస్తారని అన్నారు.

భూ భారతి చట్టం ప్రకారం భూ సంబంధిత సమస్యలను నిర్దిష్ట గడువులోపు పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్‌ తెలిపారు. సమస్య పరిష్కారం కాకుంటే కలెక్టర్‌ కు లేదా సీసీఎల్‌ఏ కు అప్పీల్‌ చేసుకోవచ్చని, ఈ చట్టంలో కొత్తగా ల్యాండ్‌ ట్రిబ్యునల్‌ కూడా అందుబాటులో ఉంటుందని సూచించారు. ధరణి లో రెవెన్యూ కోర్టులను తొలగించడం వల్ల భూ వివాదాల విషయంలో రైతులు సివిల్‌ కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేదని గుర్తు చేశారు.

కాగా, ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డులు తయారు చేసి, ప్రతి సంవత్సరం గ్రామాలలో రికార్డు డిస్‌ ప్లే చేయడం జరుగుతుందని అన్నారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. మనిషికి ఆధార్‌ కార్డు లాగా భూమికి భూదార్‌ సంఖ్య కేటాయింపు చేస్తారని, దీని ద్వారా భూ ఆక్రమణలకు అవకాశం ఉండదని అన్నారు.

ప్రస్తుతం ధరణి లో ఉన్న భూ రికార్డులు భూ భారతి చట్టంలో కొనసాగుతాయని తెలిపారు. భూ హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు అర్హులైన వారు జిల్లాలో నూతన చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదిలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పెండిరగ్‌లో ఉన్న సాధా బైనామా పరిష్కారం కోసం భూ భారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు. వీటికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు వెలువడనున్నాయని తెలిపారు.

భూ భారతి చట్టం పై ఏమైనా సందేహాలు ఉంటే తీర్చడానికి అధికారులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని అన్నారు. ఈ సదస్సులలో నిజామాబాద్‌ ఆర్డీఓ రాజేంద్రకుమార్‌, ఐడిసీఎంఎస్‌ చైర్మన్‌ తారాచంద్‌, నిజామాబాద్‌ మార్కెట్‌ కమిటి చైర్మన్‌ ముప్ప గంగారెడ్డి, డిచ్పల్లి మండల స్పెషల్‌ ఆఫీసర్‌ యోహాన్‌, స్థానిక అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Check Also

భూ సమస్యల పరిష్కారానికి రెండు అంచెల అప్పీల్‌ వ్యవస్థ

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భూ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »