నిజామాబాద్, ఏప్రిల్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నిలిచే ప్రాంతాలను ఎకో టూరిజం ప్రదేశాలుగా తీర్చిదిద్దుతామని ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడిరచారు. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ నిలిచే నందిపేట మండలం ఉమ్మెడ, జలాల్పూర్ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించేందుకు ఎకో టూరిజం డైరెక్టర్ రంజిత్ నాయక్ తో కలిసి సీసీఎఫ్ చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం నిజామాబాద్ పర్యటనకు విచ్చేశారు.

ఈ సందర్భంగా ముందుగా ఆయన జిల్లా అటవీ శాఖ అధికారి కార్యాలయంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి అటవీ, రెవెన్యూ, నీటి పారుదల తదితర శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ఏరియాలో ఎకో టూరిజం అభివృద్ధి కోసం అనువైన పరిస్థితుల గురించి కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, సమగ్ర వివరాలతో నివేదికలు సమర్పిస్తే, తక్షణమే మంజూరీ తెలుపుతూ, నిధులు కేటాయిస్తామని అన్నారు. రాష్ట్రంలోని అనువైన ప్రాంతాలను పర్యావరణహితంతో కూడిన పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించడమే లక్ష్యంగా పని చేయాలని అధికారులకు సూచించారు.
ఎకో టూరిజం అభివృద్ధి చర్యలలో భాగంగా 25 సఫారీ వాహనాలను కొనుగోలు చేశామన్నారు. ఎకో టూరిజం అభివృద్ధితో ప్రజలకు కూడా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. నందిపేటలో ఎకో టూరిజం అభివృద్ధి పనులలో భాగంగా సఫారీ వాహనాల కొనుగోలు, వాచ్ టవర్, పార్కింగ్ ప్రదేశం, రెస్టారెంట్లను మొదటగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తామని అన్నారు. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ఏరియాలు అయిన ఉమ్మెడలో 1.20 ఎకరాలు, జలాల్పూర్ లో 3 ఎకరాలలో ఎకో టూరిజం అభివృద్ధి చేస్తామన్నారు.
ఉమ్మెడ నుండి బాసర వరకు బోటింగ్ ప్రణాళికను కూడా సిద్ధం చేస్తామని అన్నారు. అలాగే ఉమ్మెడ నుండి గాదెపల్లి వరకు – 20 కి.మీ, గాదెపల్లి నుండి జలాల్పూర్ వరకు – 16 కి మీ సఫారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. 3 రోజులలో సమగ్ర ప్రణాళికలు, కావల్సిన నిధుల వివరాలతో నివేదిక సమర్పిస్తే, వెంటనే బడ్జెట్ విడుదల చేస్తామన్నారు. ఈ సమీక్షలో జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా, ఆర్డీఓ రాజాగౌడ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.